15రోజుల క్రితం వివాహం జరిగింది. కొత్తగా అత్తింట్లో అడుగుపెట్టిన వధువు, భర్తతో సంతోషంగా ఉండకుండా చాటుమాటుగా గంటల తరబడి ఫోన్లలో మాట్లాడటం మొదలెట్టింది. భర్తకు అనుమానం వచ్చి నిఘా పెట్టడంతో విషయం మొత్తం బయటపడింది. అసలు ఏం జరిగిందంటే: రాజస్థాన్‌ బార్మర్ జిల్లా రామ్‌దేవారియా నివాసి ఉమ్మేదరామ్ చాలా కాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి స్థానికంగా ఉన్న మ్యారేజ్ బ్రోకర్ జుంజారామ్, పంజాబ్‌లోని జలాలాబాద్‌కు చెందిన సోనూ, జస్వంత్‌సింగ్‌ల సహకారంతో కోటుబాయి అనే యువతితో ఉమ్మేదరామ్‌కు పెళ్లి నిశ్చయం చేశారు. అందుకు గాను ఉమ్మేదరామ్‌ నుంచి రూ.3లక్షలు తీసుకున్నారు. డిసెంబర్ 27న ఉమ్మేదరామ్, కోటుబాయి వివాహం జరిగింది. తర్వాత భర్తతో పాటూ అత్తింట్లో అడుగుపెట్టింది. కొన్ని రోజుల పాటు భార్యభర్తలు అన్యోన్యంగా ఉంది. అత్తింట్లోకి అడుగుపెట్టిన కోటుబాయి కొన్ని రోజుల పాటు ఎవరికీ అనుమానం రాకుండా ఉంది. అయితే 15రోజులు కూడా గడవకుండానే భర్తకు తెలీకుండా రోజూ గంటల తరబడి ఫోన్లలో మాట్లాడటం మొదలెట్టింది.

ఓ రోజు భర్తకు అనుమానం వచ్చి నిఘా పెట్టాడు. ఇలా జరుగుతుండగానే కోటుబాయి, తన స్నేహితురాలు గీతారాణిని కలిసి పంజాబ్‌కు పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఈ విషయాన్ని ఉమ్మేదరామ్ పోలీసులకు తెలియజేశాడు. దీంతో కోటుబాయి, గీతారాణిని అరెస్ట్ చేసి విచారించారు. పోలీసు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కోటుబాయికి అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. కొందరు వ్యక్తులంతా కలిసి ముఠాగా ఏర్పడి పెళ్లిళ్లు చేయడం తర్వాత నగదు, నగలు ఎత్తుకెళ్తుంటారని విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోటుబాయి, ఆమెకు సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇలా ఎంత మందిని మోసం చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.